అక్షరటుడే, నిజామాబాద్: తెలంగాణలో అక్టోబరు ఒకటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం మొదలు కానుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ వేదికగా 3వ తేదీన జరిగే సభలో ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావం పూరిస్తారని చెప్పారు. మంగళవారం నిజమాబాద్ కు వచ్చిన ఆయన మోదీ సభ ఏర్పాట్లపై పరిశీలించారు. నిజామాబాద్ సభ కీలకం కానుందని, తెలంగాణలో కొత్తగా రూ.6 వేల కోట్లతో 800 మెగా వాట్ల ప్రాజెక్టును వర్చువల్ విధానంలో ప్రధాని జాతికి అంకితం చేస్తారన్నారు. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించి గవర్నర్ మంచి పని చేశారని, బీఆర్ఎస్ కు కొమ్ముకాసే వారికి సామాజిక సేవా కోటాలో ఎమ్మెల్సీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. హామీలు అమలు చేసి మోదీ తెలంగాణకు రావాలని కేటీఆర్ అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా..ఆయన చేతగాని దద్దమ్మ, షాడో సీఎం కు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఎవరో అడిగిన ప్రశ్నలను తన వద్ద ప్రస్తావించటం ఏమిటని, ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు వేయద్దంటూ దాటవేశారు.
