Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: సర్కారు భూములు కబ్జా చేయడం, అక్రమ నిర్మాణాలు చేపట్టడం, అమాయకులకు అంటగట్టడం.. ఇదీ ఆ లేడీ రియల్టర్ పని. అలా.. అక్రమంగా విల్లాలు కట్టి ఏకంగా రూ.300 కోట్లకు పడగలెత్తిన శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ యాజమాని గుర్రం విజయలక్ష్మిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ప్రవేశపెట్టి.. రిమాండ్ కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంపేట బాలాజీనగర్ కు చెందిన గుర్రం విజయలక్ష్మి(48) శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, శ్రీలక్ష్మి మాగ్నస్ కన్స్ట్రక్షన్స్ అండ్, భావన జీఎల్సీ క్రిబ్స్ పేరుతో నిర్మాణ సంస్థలు స్థాపించింది.

లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ పేరుతో దుండిగల్, మల్లంపేటలో విల్లాలు నిర్మించిన గుర్రం విజయలక్ష్మి.. తప్పుడు డాక్యుమెంట్లతో ఎంతోమంది అమాయకులను ముంచేసింది. ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో.. గుర్రం విజయలక్ష్మి భూకబ్జాలు, అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతూ వచ్చాయి. మల్లంపేట సర్వే నెంబర్ 170/3 నుంచి 170/5 వరకు అక్రమ విల్లాలు నిర్మించి ఆర్థిక నేరాలకు పాల్పడింది. వీటిపై పెద్దఎత్తున ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి 11 విల్లాలను కూల్చేసింది హైడ్రా. అప్పట్నుంచి నుంచి విజయలక్ష్మి తప్పించుకుని తిరుగుతోంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Tirumala | తిరుమలలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు సీరియస్

దుండిగల్ పోలీస్టే స్టేషన్లో విజయలక్ష్మిపై 2021-2024 మధ్య 7 కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించింది. పాస్పోర్టు, వీసా తనిఖీ సమయంలో లుక్అవుట్ నోటీసు ఉన్నట్లు గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకోగా.. నిందితురాలు గుండెపోటు వచ్చినట్లు నటించిందని పోలీసులు తెలిపారు. కాగా.. లేడీ రియల్టర్ పట్టుబడటంతో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

Advertisement