Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: ‘కాంగ్రెస్​ అంటేనే పెద్ద అవినీతి గని.. దేశానికి పట్టిన శని’ అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు జీవన్​రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏ గ్రామంలోనైనా కాంగ్రెస్​ ఇచ్చిన హామీలు నూరు శాతం అమలైనట్లు చూపిస్తే రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని సవాల్​ విసిరారు. మాట తప్పడం..మడమ తిప్పడం కాంగ్రెస్​ పార్టీకి పేటెంట్​గా మారిందని విమర్శించారు. అమలు సాధ్యం కాని హామీలిచ్చి ఇప్పుడు బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో ఓట్ల కోసం కొత్త డ్రామాలు ఆడేందుకు కాంగ్రెస్​ మరోమారు సిద్ధమైందన్నారు. హామీల పేరుతో మోసం చేసేందుకు గ్రామాలకు వస్తే తిప్పికొట్టాలని సూచించారు. ఆరు గ్యారెంటీలు ఎందుకు అమలు చేయట్లేదని కాంగ్రెస్​ నాయకులను నిలదీయాలని పేర్కొన్నారు. బీసీ కులగణన పేరుతో సీఎం రేవంత్​రెడ్డి బీసీల గొంతు కోశారన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్​కు చెదలు పట్టేలా చేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ నుంచి చిట్టచివరి సీఎం రేవంత్​రెడ్డే అవుతారని జోస్యం చెప్పారు. మాజీమంత్రి సుదర్శన్ రెడ్డికి అల్జీమర్ జబ్బు ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్​ లది అవినీతి బంధమని విమర్శించారు.

Advertisement