అక్షరటుడే, వెబ్డెస్క్: ఎస్ఎల్బీసీ (SLBC) ప్రమాదంపై బీఆర్ఎస్ ఓవరాక్షన్ చేస్తోందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మండిపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లో కార్మికుల ఆచూకీ కనుగొంటామని పేర్కొన్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రమాదం
గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిందని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం సహాయక చర్యలు చేపడుతున్నామని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో ఆరుగురు చనిపోతే కేసీఆర్ పరామర్శించలేదని విమర్శించారు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే కనీసం వెళ్లలేదన్నారు. ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని విమర్శించారు.
ఆచూకీపై ఉత్కంఠ
ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి ఆరు రోజులైనా 8 మంది కార్మికుల ఆచూకీ లభించకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. వారిని చేరుకునే మార్గంలో బురద ఉండడంతో దానిని ప్రస్తుతం తొలగిస్తున్నారు. సహాయ చర్యల్లో మార్కోస్ కమాండోలు పాల్గొంటున్నారు.