అక్షరటుడే, వెబ్డెస్క్: పార్టీలో ఉంటూ గీత దాటే వారికి కాంగ్రెస్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సొంత పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్)ను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో గీత దాటి మాట్లాడే ఇతర నేతలకు హెచ్చరికలు పంపినట్లైంది.
నేతల ఇష్టారాజ్యం
కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పలు సందర్భాల్లో పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారు. కుల గణన విషయంలో సీఎం రేవంత్రెడ్డికి కొందరు సహకరించలేదని సమాచారం. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను ఏ విషయంలో వ్యతిరేకించినా బీసీ కుల గణనపై సపోర్టు చేయాలని స్వయంగా కోరారు. దీనిని బట్టి పార్టీలో అంతర్గతంగా ఏం నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో పార్టీ లైన్ దాటిన ఎమ్మెల్సీ మల్లన్నను సస్పెండ్ చేసి మిగతా వారికి స్పష్టమైన సంకేతాలు పంపింది.
వర్గపోరుకు చెక్ పడేనా..
రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు నడుస్తోంది. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా కొందరు నేతలు వ్యవహరిస్తున్నారు. పార్టీ టికెట్పై గెలిచిన ఎమ్మెల్సీనే సస్పెండ్ చేయడంతో అలాంటి వారు నేతలంతా సైలెంట్ అయ్యే అవకాశం ఉంది.
‘మీనాక్షి’ మార్క్
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహరాల ఇన్ఛార్జిగా నియామకం అయ్యాక తొలిసారి హైదరాబాద్ వచ్చిన మీనాక్షి నటరాజన్ తన మార్క్ చూపించారు. పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువని, భిన్నాభిప్రాయాలు సహజమని చెప్పిన ఆమె.. పార్టీకి నష్టం కలిగించే వారిపై చర్యలుంటాయని స్పష్టం చేస్తూ తీన్మార్ మల్లన్నపై వేటు వేశారు. పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చిన ఆమె.. నష్టం చేసే వారిపై చర్యలకు వెనుకాడమని తేల్చి చెప్పారు.
రాహుల్ గాంధీ ఆదేశాలతోనే..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాలతోనే తీన్మార్ మల్లన్నపై వేటు వేసినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారికి ఇదొక హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్లో ఎవరైనా పార్టీలైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు.