అక్షరటుడే, హైదరాబాద్: ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు(illegal mining), అక్రమ సరఫరా(illegal supply)పై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. కఠిన చర్యలతోనే అక్రమాలను అడ్డుకోగలమని, ప్రభుత్వానికి ఆదాయం పెంచగలమన్నారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో గనుల శాఖపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిన విధానాన్ని, పెరిగిన ఆదాయాన్ని అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్ల్లో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక సరఫరాపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారానే ఇసుక సరఫరా
నీటి పారుదల, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేప్టటే పనులకు, పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టే సంస్థలకు అవసరమైన ఇసుకను తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (TGMDC) నుంచే సరఫరా చేసేలా చూడాలని సీఎం సూచించారు.
హైదరాబాద్కు మూడు వైపులా..
సరైన ధరలకు ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తే వినియోగదారులు అక్రమంగా సరఫరా చేసే వారిపై ఆధారపడరని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంతో పాటు సమీప ప్రాంతాల్లోనే ఇసుక ఎక్కువగా వినియోగం జరుగుతోందని తెలిపారు. తక్కువ మొత్తంలో ఇసుక అవసరమైన వారు కొనుగోలు చేసేలా నగరానికి మూడు వైపులా ఇసుక స్టాక్ పాయింట్లు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు.
బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు
గనుల శాఖ పరిధిలోని వివిధ ఖనిజాల క్వారీలకు గతంలో విధించిన జరిమానాలు, వాటి వసూళ్లపైనా సీఎం అధికారులను ఆరా తీశారు. ఇందుకు సంబంధించిన విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకొని సమస్యను పరిష్కరించాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఖనిజాల మైనర్ బ్లాక్ల వేలానికి వెంటనే టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీజీఎండీసీ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.