Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్​: AICC :రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరో వివాదం మొదలైంది. కాంగ్రెస్ సీనియర్ నేత ఇంట్లో మున్నూరు కాపు సామాజిక వర్గ నేతలు భేటీ కావడం, అందులో ఆల్ పార్టీ నేతలు పాల్గొనడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వి హనుమంతరావు(వీహెచ్​) ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశంపై పార్టీ నాయకత్వం సీరియస్​ అయినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్​ బీజేపీ(bjp) ​, బీఆర్​ఎస్(BRS)​ నాయకులు కూడా హాజరయ్యారు. మున్నూరు కాపు నేత, ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​(Aadi Srinivas)కు మంత్రి పదవి ఇవ్వాలని ఈ భేటీలో తీర్మానం చేశారు.

AICC : మీనాక్షి నటరాజన్​ ఆరా

సీనియర్​ నేత ఇంట్లో ప్రతిపక్ష పార్టీల నాయకులతో మీటింగ్​ పెట్టడంపై కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan​) వివరాలు తెలుసుకున్నారు. ఈ సమావేశంలో వీహెచ్​తో పాటు, ఆది శ్రీనివాస్​, సీనియర్​ నేత కే కేశవరావు పాల్గొన్నారు. అయితే ఇందులో పలువురు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు తెలిసింది. అంతేకాకుండా కులగణన విషయంలో పలు వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్​ అధిష్టానం సీరియస్​ అయింది. మీటింగ్​ పెట్టి మరి పార్టీని, ప్రభుత్వాన్ని తిట్టించారని వీహెచ్​పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

బీసీ కులగణన చేస్తే అభినందించాల్సింది పోయి, విమర్శలు చేస్తారా..? అని నిలదీసింది. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని వీహెచ్ ను మీనాక్షి నటరాజన్ వివరణ కోరినట్లు సమాచారం.

AICC : బల ప్రదర్శనకు సిద్ధం

కులగణనతో తమ కులం వారి జనాభా తక్కువగా చూపించారని మున్నూరు కాపులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వీహెచ్ ఇంట్లో సమావేశం నిర్వహించారు. తమ కులానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. అంతేగాకుండా తమ ఇతర డిమాండ్ల సాధన కోసం బల ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. మంత్రి పదవి గురించి డిమాండ్​ చేయడంపై కూడా అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

AICC : స్పందించిన వీహెచ్

మున్నూరు కాపు మీటింగ్​పై ఏఐసీసీ సీరియస్​ కావడంతో వీహెచ్​ స్పందించారు. సమావేశంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడలేదన్నారు. బీసీ కులగణనకు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు కూడా సహకరిస్తామని చెప్పారన్నారు. త్వరలో మున్నూరు కాపుల సభ పెడతామన్నారు. సీఎంను కలిసిన తర్వాత ఎప్పుడు పెడతామో చెబుతామని వీహెచ్​ పేర్కొన్నారు. తాను పార్టీకి నష్టం కలిగించే వ్యక్తిని కాదని ఆయన అన్నారు.

Advertisement