
అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad – Srisailam Highway : మన దగ్గర అండర్ గ్రౌండ్ రోడ్లు తక్కువే కానీ, వెస్టర్న్ ఘాట్స్ సైడ్ వెళ్తే మాత్రం అండర్ గ్రౌండ్ రోడ్లు చాలా ఉంటాయి. ఎత్తైన కొండలు ఉన్న ప్రాంతాల్లో ఘాట్ రోడ్లతో పాటు కొన్ని ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ రోడ్లను నిర్మించారు. అండర్ గ్రౌండ్ రైల్వేట్రాక్స్ కూడా ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో ఘాట్ రోడ్ల కంటే అండర్ గ్రౌండ్ రోడ్లే ఎంతో సేఫ్.
అందుకే.. అటవీ ప్రాంతం, కొండ ప్రాంతం అయిన శ్రీశైలం వెళ్లే రూట్ను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్లేందుకు ఎలాంటి బ్రేక్ లేకుండా ప్రస్తుతం ఉన్న రోడ్డును విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దానిలో భాగంగానే కేంద్రానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. అయితే.. ఘాట్ రోడ్ను వెడల్పు చేయడం కంటే కూడా ఎలివేటెడ్ కారిడార్ కాకుండా అండర్ గ్రౌండ్ రోడ్డు నిర్మిండంపై కసరత్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది.
Hyd to Srisailam Highway : అనుమతుల సమస్యతోనే..
నిజానికి శ్రీశైలం హైవేకు అటవీ శాఖ అనుమతులు రావడం కొంచెం కష్టమే. ఎందుకంటే అదే రూట్లో అమ్రాబాద్ టైగర్ రిజర్వు ప్రాంతం ఉంది. అలాగే.. ఎన్టీసీఏ ప్రాంతం కూడా ఉంది. రాత్రి వేళ ఆ ప్రాంతాల్లో జంతువులు సంచరిస్తాయి. వన్య ప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఆ రోడ్డును వెడల్పు చేస్తే వన్యప్రాణుల ప్రాణాలకు ప్రమాదమని, అటవీ శాఖ నుంచి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని, ఆ రూట్లో అండర్ గ్రౌండ్ రోడ్ వేసే అవకాశాన్ని పరిశీలించాలని కేంద్రం చెబుతోంది.
ఒకవేళ అండర్ గ్రౌండ్ రూట్ రెడీ అయితే రాత్రి వేళ కూడా ఇక శ్రీశైలానికి ప్రయాణం చేయొచ్చు. ప్రస్తుతం రాత్రి 9 దాటితే మన్ననూరు వద్ద గేట్లు మూసేస్తారు. మళ్లీ ఉదయం 6 తర్వాతే గేట్లు తెరుస్తారు. అందుకే ఆ రూట్లోనే మన్ననూరు నుంచి పాతాళ గంగ వరకు, 62.5 కి.మీటర్ల రోడ్డును విస్తరించాలని ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.