అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీకి మంత్రి పదవి అందని ద్రాక్షలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ ఓటమి చెందారు. తీరా సొంత పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయనకు మంత్రి పదవి చేజారింది. తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించిన ఆయనకు చేదు అనుభవమే మిగిలింది.
Kamareddy | సీనియర్ నేతగా..
కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డికి చెందిన మహమ్మద్ అలీ షబ్బీర్ ఆలీ 1970లో ఎన్ఎస్యూఐ కార్యకర్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 1987లో మాచారెడ్డి ఎంపీపీగా పోటీ చేసి ఓడిపోయారు. 1989లో కామారెడ్డి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చెన్నారెడ్డి మంత్రివర్గంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా, మత్స్య శాఖ ఇన్చార్జి మంత్రిగా చేశారు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విద్యుత్, బొగ్గు, మైనార్టీ సంక్షేమ శాఖ, వక్ఫ్, ఉర్దూ అకాడమీ, సమాచార శాఖ మంత్రిగా సేవలందించారు. 2013లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పని చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేతగా కొనసాగారు.
Kamareddy | మరోసారి మంత్రి పదవి కోసం..
2023లో ఓడినా.. మైనార్టీ సామాజికవర్గం నుంచి పార్టీలో కీలక నాయకుడిగా ఉన్నారు. పైగా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వ సలహాదారు పోస్టు కట్టబెట్టి కేబినేట్ హోదా కల్పించారు. అయితే షబ్బీర్ అలీ మాత్రం మైనార్టీ కోటాలో మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ టికెట్ పొంది.. ఆ తర్వాత జరిగే కేబినెట్ విస్తరణలో మంత్రిగా కావాలని కలలు కన్నారు. ఇందుకోసం ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేశారు. చివరికి పార్టీ అధిష్టానం ఇతరులకు ఎమ్మెల్సీ టికెట్ కట్టబెట్టింది.