అక్షరటుడే, వెబ్డెస్క్: BRS : వరంగల్ జిల్లాలో ఏప్రిల్ 27న కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే భారాస రజతోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాటు స్థలాన్ని ఆదివారం మాజీ మంత్రి హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, చల్ల ధర్మారెడ్డి సహా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇతర నాయకులు పరిశీలించారు. దేవన్న పేట వద్ద పరిసరాలను సరిచూశారు.

గజ్వేల్ సమీపంలోని ఎర్రవెల్లి ఫామ్హౌస్లో పార్టీ నాయకులతో ఇటీవల జరిగిన సమావేశంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సుదీర్ఘంగా చర్చించారు. 15 నెలల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని, భారాసనే తమ ప్రయోజనాలు కాపాడుతుందని ప్రజలు భావిస్తున్నట్లు కేసీఆర్ చెప్పుకొచ్చారు.
తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు తమను తాము తిరిగి అంకితం చేసుకోవాలని నాయకులను, శ్రేణులను కేసీఆర్ కోరారు. తెలంగాణ ప్రజలకు,వారి ప్రయోజనాలకు భారాస రక్షణ కవచం అని ఆయన పేర్కొన్నారు.
భారాస సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా పార్టీ వ్యవస్థాపక దినోత్సవమైన ఏప్రిల్ 27న వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్ ఆనాడే ప్రకటించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.