అక్షరటుడే, వెబ్డెస్క్ : BRS | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) పార్టీకి పూర్వ వైభవం తీసుకు రావాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న కేడర్లో ఉత్సాహం నింపడం కోసం ఆయన ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే సిల్వర్ జూబ్లీ(Silver Jublee) వేడుకలకు నాయకులు, కార్యకర్తలను సమాయత్తం చేయనున్నారు.
BRS | మొదట సూర్యాపేటలో..
కేటీఆర్(KTR) రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ నెల 20న సూర్యాపేట(Suryapeta)లో, 23న కరీంనగర్(Karimnagar)లో ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఏప్రిల్ 27 బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని గులాబీ నాయకత్వం భావిస్తోంది. దీంతో అసెంబ్లీ సమావేశాలు ముగిశాక కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు.
BRS | డీలాపడ్డ కార్యకర్తలు
కొద్దిరోజులుగా బీఆర్ఎస్ కార్యకర్తలు డీలాపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పలువురు ముఖ్య నేతలు పార్టీ మారారు. మరికొందరు అసలు నియోజకవర్గాల్లో కనిపించకుండా పోయారు. దీంతో పలు నియోజకవర్గాల్లో పార్టీ కేడర్కు దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు.
BRS | స్థానిక ఎన్నికలే లక్ష్యంగా..
ప్రస్తుతం బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తోంది. ఆయా అంశాలపై అసెంబ్లీలో గొంతు లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతోంది. ఈ క్రమంలో సమావేశాల అనంతరం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. అలాగే త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు.