అక్షరటుడే, వెబ్డెస్క్: Sharmila | పిఠాపురంలో జనసేన నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన హీట్ ఇంకా చల్లారడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా కూటమేతర పార్టీలన్నీ కూడా పవన్ కల్యాణ్కు కౌంటర్ ఇవ్వడం మనం చూస్తున్నాం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్, జనసేన పార్టీ సిద్ధాంతాల గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీ మైకం నుంచి బయటపడాలంటూ హితవు పలికారు. పార్టీని స్థాపించిన ఉద్దేశాన్ని కూడా పవన్ కల్యాణ్ విస్మరించి ప్రవర్తిస్తోన్నారంటూ చురకలు అంటించారు.
పవన్ కల్యాణ్ … చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్లొదిలేసిన ఆయన … ఇప్పుడు మోదీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారని విమర్శించారు. పవన్ మాటలు చూస్తుంటే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నట్టు కనిపిస్తోందని షర్మిళ పేర్కొన్నారు. జనసేన పార్టీని ‘ఆంధ్ర మత సేన’ పార్టీగా మార్చారని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. జనసేన… జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణం. సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరం అని షర్మిళ తన సోషల్ మీడియాలో పేర్కొంది.
ఇక పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పటికైనా మేల్కొని, బీజేపీ మైకం నుంచి బయట పడాలి అంటూ షర్మిళ హితవు పలికింది. మరి దీనిపై పవన్ కళ్యాణ్ ఏమైన స్పందిస్తారా, లేకుంటే జనసేన నాయకులు కౌంటర్ ఇస్తారా అన్నది చూడాలి.