అక్షరటుడే, వెబ్డెస్క్ : TTD | తిరుమల(TTD) వేంకటేశ్వర స్వామిని దర్శించుకోని నిత్యం ఎంతో మంది తరిస్తారు. స్వామి వారిని ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలని ఎందరో కలలు కంటారు. తిరుమలకు వెళ్లే తెలంగాణ భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై భక్తులకు దర్శనం కల్పిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.
TTD | ఎప్పటి నుంచి అంటే..
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదించాలని గత కొంతకాలంగా డిమాండ్ ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా సిఫార్సు లేఖలను అనుమతించాలని ఆదేశించారు. దీంతో ఫిబ్రవరి 1 నుంచి అమలు చేస్తామని చెప్పినా.. టీటీడీ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇటీవల తిరుమల వెళ్లిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు సిఫార్స్ లేఖలను ఆమోదించకుంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరం వచ్చి టీటీడీతో తేల్చుకుంటామని వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో టీటీడీ సిఫార్సు లేఖలను ఆమోదిస్తామని సోమవారం ప్రకటించింది. ఈ నెల 24 నుంచి అమలులోకి వస్తుందని చెప్పింది.
TTD | ఒక లేఖపై ఆరుగురికి దర్శనం
తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలపై భక్తులకు దర్శనం కల్పించనున్నారు. సోమ, మంగళవారాల్లో తెలంగాణ నుంచి వచ్చే సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. బుధ, గురువారాల్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం అనుమతిస్తారు. ఒక ప్రజాప్రతినిధికి సంబంధించి రోజుకు ఒక లేఖను మాత్రమే అనుమతిస్తారు. ఒక్కో లేఖపై ఆరుగురికి దర్శనం కల్పించనున్నారు.