అక్షరటుడే, కామారెడ్డి: పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు చంద్రమోహన్, శ్రీనివాస్ రెడ్డి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డితో కలిసి నోడల్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థి చేసే ప్రతి ఖర్చు లెక్కలో చూపాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలని సూచించారు. కోడ్ ఉలంఘన, డబ్బు, మద్యం అక్రమ తరలింపుపై కేసులు నమోదు చేసి రోజువారి నివేదికలు సమర్పించాలన్నారు. సీ విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై తక్షణమే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు సమాచారమివ్వాలని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రకటన వెలువడిన నాటి నుంచి నేటి వరకు రూ.50 లక్షల నగదు, రూ.41 లక్షల విలువ గల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సాధారణ పరిశీలకులుగా గోపాల్ జి తివారీ, పోలీసు పరిశీలకులుగా దీపక్ భార్గవ్ను ఎన్నికల కమిషన్ నియమించిందని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో నోడల్ అధికారులు వరదా రెడ్డి, శ్రీనివాస్, అంబాజీ, శ్రీనివాస్ రెడ్డి, రాజారాం పాల్గొన్నారు.