అక్షరటుడే, వెబ్డెస్క్: Adavi Thalli Bata : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చొరవ వల్ల ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తిస్థాయిలో రహదారుల అభివృద్ధికి అడుగులు పడనున్నాయి.
‘అడవి తల్లి బాట’ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో(tribal villages) రెండు రోజులపాటు డిప్యుటీ సీఎం పవన్ పర్యటించనున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులు పర్యటిస్తారు. ఈ నెల 7న ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలకు చేరుకుంటారు.
అడవి తల్లి బాట పేరిట చేపట్టే రహదారుల నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేస్తారు. అక్కడే జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 8న ఉదయం అరకు మండలం సుంకరమిట్టలో పర్యటిస్తారు. అక్కడ నిర్మించిన ఉడెన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.
అనంతరం అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కు(Indira Gandhi Zoological Park)కు వెళ్తారు. అక్కడ ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజానికి ఉన్న అవకాశాలపై చర్చిస్తారు.