మాకు ఎవరితోనూ విభేదాలు లేవు

0

అక్షరటుడే, ఆర్మూర్‌: తమకు ఎవరితోనూ విభేదాలు లేవని.. బీఆర్‌ఎస్‌ పార్టీలో అందరం కుటుంబ సభ్యులుగా ఉండేవాళ్లమని ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పండిత్‌ వినీత అన్నారు. చిన్న భేదాభిప్రాయంతోనే మాజీ ఎమ్మెల్యే తనపై అవిశ్వాసం పెట్టించి పదవి నుంచి తొలగించాలని ప్రయత్నించారన్నారు. దీన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్మూర్‌లో సోమవారం చైర్‌పర్సన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. తనపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు అధికారులు అవగాహన లేమితో ప్రకటించారన్నారు. కానీ, ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అవిశ్వాసం వీగిపోయినట్లు గతంలోనే స్పష్టత ఇచ్చారన్నారు. తనవెంట ఉండి మద్దతు తెలిపిన కౌన్సిలర్లు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్‌ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు. చైర్‌పర్సన్‌ పార్టీ మారుతున్నారని వస్తున్న ప్రచారంపై ఆమెను విలేకరులు ప్రశ్నించగా.. తాము ప్రస్తుతం ఇండిపెండెంట్‌గా ఉన్నామని.. భవిష్యత్తు కార్యచరణపై చర్చించి ప్రకటిస్తామని తెలిపారు.