అక్షరటుడే, ఎల్లారెడ్డి: గులాబీ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఉమ్మడి జిల్లా నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా ఎల్లారెడ్డికి చెందిన మాజీమంత్రి నేరెళ్ల ఆంజనేయులు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే పండరి ‘కారు’ దిగి కమలం గూటికి చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సమక్షంలో మంగళవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోడీ చేతిలోనే దేశం సుభిక్షంగా ఉంటుందని, జహీరాబాద్ పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్ గెలుపునకు శాయశక్తులా కృషి చేస్తామని వారు తెలిపారు. అంతేకాకుండా బీఆర్ఎస్ నుంచి గాంధారి మాజీ జడ్పీటీసీ సభ్యుడు తానాజీ రావు, సదాశివనగర్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు ఏలేటి మహేందర్ రెడ్డి ఎంపీ బీబీ పాటిల్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పైడి ఎల్లారెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, మురళీధర్ గౌడ్, బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.