అక్షరటుడే, వెబ్డెస్క్ : Bird Flu | హైదరాబాద్(Hyderabad) శివారులో బర్డ్ఫ్లూ కేసులు నమోదు కావడంతో చికెన్ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. కొన్నిరోజుల క్రితం ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడంతో చికెన్ అమ్మకాలు తగ్గిపోయాయి. ప్రజలు చికెన్ తినాలంటేనే భయపడ్డారు. ఇటీవల బర్డ్ఫ్లూ భయం పోవడంతో మళ్లీ చికెన్ తింటున్నారు.
ఈ తరుణంలో హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్(Abdullapoormet) మండలంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. అబ్దుల్లాపూర్మెట్ పరిధిలో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. వాటి శాంపిల్స్ను ల్యాబ్కు పంపగా.. బర్డ్ఫ్లూగా తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కోడి గుడ్లు కూడా ఎవరికీ అమ్మొద్దు అని పోల్ట్రీ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ బర్డ్ఫ్లూ వ్యాప్తి చెందుతుండటంతో పౌల్ట్రీ రైతులు, చికెన్ సెంటర్ల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.