అక్షరటుడే, ఆర్మూర్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసిన వ్యవహారంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మూర్లో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు స్పందిస్తూ.. శుక్రవారం అని చూడకుండా ఆడపడుచును తీసుకెళ్లారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని.. శుక్రవారం నాడే లిక్కర్ స్కాం మీటింగ్లు జరిగాయని పేర్కొన్నారు. పైసలు బాగా దొరుకుతాయని శుక్రవారం నాడే స్కాం చేశారని వ్యాఖ్యానించారు. అరెస్టు చేస్తే ఓ బాధ.. చేయకపోతే మరొక బాధ అని పేర్కొన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. అర్వింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా ఓడిస్తానని కవిత శపథం చేసిందని విలేకరులు గుర్తుచేయగా.. జైలు నుంచి నామినేషన్ వేస్తారా? అని ఆయన వ్యాఖ్యానించారు.