అక్షరటుడే, వెబ్డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. సీఈసీ రాజీవ్ కుమార్ శనివారం ఢిల్లీలో ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేశారు. దేశవ్యాపంగా మొత్తం 543 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 2,100 మంది ఎన్నికల అబ్జర్వర్లను నియమించింది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రక్రియ ఏప్రిల్ 19న మొదలు కానుంది. జూన్ 4వ తేదీన దేశవ్యాప్తంగా కౌంటింగ్ జరగనుంది. అలాగే లోక్సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ఓటరు జాబితాలో మార్పుచేర్పులకు అవకాశం కల్పించారు. షెడ్యూల్ ప్రకటనతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దేశంలో ఖాళీగా ఉన్న 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో కంటోన్మెంట్ నియోజకవర్గం ఒకటి.
10.50 లక్షల పోలింగ్ కేంద్రాలు
దేశవ్యాప్తంగా 10.50 లక్షల పోలింగ్ కేంద్రాలుండగా.. ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది పాల్గొననున్నారు. ఓటింగ్ కోసం 55 లక్షల ఈవీఎంలు వినియోగించనున్నారు. మొత్తం 96.8 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో 49.7 కోట్ల పురుష ఓటర్లు, 47.1 మహిళా ఓటర్లు ఉన్నట్లు సీఈసీ తెలిపింది. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే ఓటింగ్ వేసుకునే సౌకర్యం కల్పించింది.
నాలుగో విడతలో తెలంగాణలో..
నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 18న నోటిఫికేషన్, ఏప్రిల్ 25 వరకు నామినేషన్లకు గడువు, ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 29న విత్డ్రాకు అవకాశం ఇచ్చారు. మే 13న ఎన్నికలు జరుగనున్నాయి.
