అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా సౌకర్యాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు (collector rajeev gandhi hanumanthu) అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. రంజాన్(ramadan) ఉపవాస దీక్షల సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు.
ఎలాంటి ఇబ్బందులు రాకూడదు..
జిల్లావ్యాప్తంగా ఎలాంటి ఇబ్బందులు, లోటుపాట్లకు తావులేకుండా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో సౌకర్యాలు కల్పించేలా సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. ప్రధానంగా ఎక్కడ కూడా తాగునీరు, పారిశుధ్యం వంటి సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం రాకుండా చూడాలన్నారు. బోర్లు, పైప్ లైన్ మరమ్మతులు ఉంటే ముందస్తుగా చేపట్టాలని తెలిపారు. అన్ని ప్రాంతాలకు నీటి సరఫరా జరిగేలా చర్యలు చేపట్టాలని మిషన్ భగీరథ(Mission Bhagiratha) అధికారులను ఆదేశించారు.
విద్యుత్, తాగునీటి సరఫరాలో అంతరాయాలొద్దు..
ప్రార్థనా సమయాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈకి సూచించారు. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుధ్య సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. కాగా, వేసవి సీజన్ ప్రారంభం అవుతున్న దృష్ట్యా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని మిషన్ భగీరథ ఈ.ఈ రాకేష్ కు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్ వికాస్ మహతో, అదనపు డీసీపీ బస్వారెడ్డి, జడ్పీ సీఈవో సాయాగౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, డీపీవో శ్రీనివాస్, డీఎంహెవో రాజశ్రీ, జిల్లా మైనారిటీ అధికారిణి కృష్ణవేణి, కార్మికశాఖ అధికారి యోహాన్, ఏసీపీలు రాజావెంకట్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్వర్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.