అక్షరటుడే, తిరుమల: TTD : తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించకపోతే ప్రజాప్రతినిధులందరం తిరుమలకే వచ్చి టీటీడీతో తేల్చుకుంటామని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు(Medak MP, BJP leader Raghunandan Rao) వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై శ్రీవారి దర్శనాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి చేసిన ప్రకటనను అమలు చేయాలని రఘునందన్ డిమాండ్ చేశారు.
TTD : వేసవి సెలవుల్లో దర్శనం కల్పించాలి..
తిరుమలలో శుక్రవారం వీఐపీ బ్రేక్ దర్శనం(VIP break darshan) సమయంలో రఘునందన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నరు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వేసవి సెలవుల్లో తమ సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు దర్శనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే టీటీడీతో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devsthanam) వెంటనే స్పందించాలన్నారు.
TTD : చంద్రబాబు జోక్యం చేసుకోవాలి..
ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదిస్తామని గతంలో బీఆర్ నాయుడు(BR Naidu) నాయకత్వంలోని టీటీడీ బోర్డు(TTD Board) ప్రకటించిందని రఘునందన్ గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 మంది ఎమ్మెల్యేలకు అనుమతి ఉండగా, ఇప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఎమ్మెల్యేలకే పరిమితం కావడం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల పట్ల వివక్ష చూపొద్దన్నారు. ఈ విషయంలో చంద్రబాబు జోక్యం చేసుకోవాలని రఘునందన్ కోరారు.