అక్షరటుడే, వెబ్డెస్క్: ఢిల్లీ లిక్కర్స్కాం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈడీ కస్టడీ యుగియడంతో ఆమెను మంగళవారం అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. న్యాయస్థానం కవితకు ఏప్రిల్ 9వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆమెను కాసేపట్లో తీహార్ జైలుకు తరలించనున్నారు. బెయిల్ కోసం కవిత తరపున న్యాయవాదులు పిటిషన్ వేయగా..ఏప్రిల్ ఒకటిన ఈ పిటిషన్ పైన వాదనలు జరగనున్నాయి. కాగా.. కోర్టుకు తరలించిన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఇది మనీలాండరింగ్ కేసు కాదని.. పొలిటికల్ లాండరింగ్ కేసు అని వ్యాఖ్యానించారు. తనపై పెట్టిన అక్రమ కేసుపై పోరాటం చేస్తానన్నారు. ఇప్పటికే ఒక నిందితుడు బీజేపీలో చేరాడని, మరో నిందితుడు రూ.50 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడని, మరొకరికి ఆ పార్టీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. తాను అప్రూవర్ గా మారేది లేదని, ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని వ్యాఖ్యానించారు.