అక్షరటుడే, కామారెడ్డి : MLA KVR | నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను చెప్పిన పనులు కూడా కావట్లేదని.. ఇలా జరిగితే ఎమ్మెల్యేగా తన స్థానం ఎందుకని వెంకట రమణా రెడ్డి ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మాట్లాడారు. నియోజకవర్గంలో ఓడిపోయి పారిపోయిన వారు చెప్పిన వాటికి మాత్రం నిధులు మంజూరు చేస్తారా? అని ప్రశ్నించారు. జిల్లాలో ఇన్ఛార్జి మంత్రుల ఆధిపత్యం ఎంతవరకు ఉంటుందో చెప్పాలన్నారు. గత ప్రభుత్వంలో ఇబ్బందులకు గురయ్యామని.. ప్రస్తుతం కూడా అదే తీరును అవలంభించడం సమంజసం కాదన్నారు.
MLA KVR | పోలీస్ ప్రొటెక్షన్ అడగట్లేదు..
ఇన్ఛార్జి మంత్రి ఓడిపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తే గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలని ప్రశ్నించారు. తానేమీ పోలీస్ ప్రొటెక్షన్ అడగడం లేదని, అధికారులు వచ్చి తన ఎదురుగా నిలబడాలని కోరుకోవడం లేదన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో 84 ప్రశ్నలను అడిగితే ఎనిమిది ప్రశ్నలకు మాత్రమే సమధానమిచ్చారని, సమాచార హక్కు చట్టం ద్వారా 86 ప్రశ్నలను అడిగితే ఒక్కో అధికారి ఒక్కో విధంగా సమాధానం చెప్పారన్నారు. అధికారులే సంబంధిత పనులపై నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.
MLA KVR | ఆర్టీఐ కింద అడిగినా సమాచారం ఇవ్వరా..?
ఎమ్మెల్యేగా తాను ఆర్టీఐ కింద సమాచారం అడిగితే సమాధానం ఇవ్వకపోతే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలని తాను కోరుకుంటున్నానని, తనకు మాటలు మాట్లాడటం చేతకాక కాదని.. తన గురించి కామారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్లను ఎవరిని అడిగినా చెబుతారన్నారు. పనుల విషయంలో ఎమ్మెల్యే చెప్పిన పనులు కావాలని, ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.