హైదరాబాద్, అక్షరటుడే: ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ హైదరాబాద్లో తమ ఐటీ క్యాంపస్ ను విస్తరించనుంది. పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్ లో అదనంగా 17 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ఇన్పోసిస్ ప్రణాళికను సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా అక్కడున్న సదుపాయాలను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.
మొదటి దశలో రూ.750 కోట్ల పెట్టుబడి
దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారితో ఇన్ఫోసిస్ (Infosys Limited) సీఎఫ్వో జయేష్ సంఘ్రాజ్క చర్చలు జరిపిన అనంతరం పెట్టుబడుల విస్తరణకు అంగీకారం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా ఇన్ఫోసిస్ సంస్థ మొదటి దశలో రూ.750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపడుతుంది. వచ్చే రెండు, మూడేళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఫోసిస్ లో దాదాపు 35వేల మంది ఉద్యోగులున్నారు.