అక్షరటుడే, వెబ్డెస్క్: VI | టెలికాం(TELECOM) రంగంలో గుత్తాధిపత్యాన్ని నివారించడానికి ఓ వైపు బీఎస్ఎన్ఎల్ను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం(CENTRAL GOVERNMENT).. మరోవైపు వోడాఫోన్ ఐడియానూ కాపాడే ప్రయత్నాలను కొనసాగిస్తోంది. తాజాగా ఆ కంపెనీలో తన వాటాను పెంచుకోవడానికి సర్కారు అంగీకరించింది. వీఐ కంపెనీ బకాయిపడిన ఈ-స్పెక్ట్రమ్(E-SPECTRUM) వేలం మొత్తాన్ని తన వాటాగా మార్చుకోనుంది. రూ. 36,950 కోట్ల విలువైన షేర్లను సొంతం చేసుకోవడం ద్వారా వీఐలో కేంద్రం వాటా 22.6 నుంచి 49 శాతానికి చేరనుంది. దీంతో వోడాఫోన్ వాటా 24.1 నుంచి 16.1 శాతానికి, ఆదిత్య బిర్లా గ్రూప్ వాటా 14 నుంచి 9.4 శాతానికి తగ్గనుంది.
VI | జియో రాకతో మారిన సమీకరణాలు..
టెలికాం రంగంలో సునామీలా రిలయన్స్ జియో(RELIANCE JIO) సంస్థ రావడంతో చాలావరకు టెలికాం సంస్థలు కుదేలయ్యాయి. చాలా సంస్థలు కాలగర్భంలో కలిసిపోయాయి. భారీ నెట్వర్క్ ఉన్న ఎయిర్టెల్(AIRTEL) మాత్రమే ఎదురు నిలవగలిగింది. పోటీని తట్టుకోలేక వొడాఫోన్(VODAFONE), ఐడియా(IDEA)లు విలీనమయ్యాయి. అయినా ఆ సంస్థ కష్టాలు గట్టెక్కలేదు. రోజురోజుకు సబ్స్క్రైబర్లు తగ్గడమే తప్ప వీఐ(VI) వైపు వచ్చేవారు కరువయ్యారు.
అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ సంస్థ మూతపడితే టెలికాం రంగంలో డ్యుయోపోలీ ఏర్పడి వినియోగదారులపై భారం పడే ప్రమాదం ఉంది. దీనిని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్(BSNL)కు నూతన జవసత్వాలు అందించేందుకు ప్రయత్నిస్తూనే ప్రైవేట్ రంగానికి చెందిన వీఐని కూడా కాపాడేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఈ-స్పెక్ట్రమ్ వేలం బకాయిలను ఈక్విటీ(EQUITY)గా మార్చుకోవాలని టెలికాం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.