అక్షరటుడే, ఇందూరు: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గప్చుప్ తిన్నాక, డబ్బులు అడిగితే.. సదరు చిరు వ్యాపారిపై దాడి చేశాడు. నగరంలోని రెండో ఠాణా పరిధిలో ఈ ఘటన జరిగింది.
శంకర్ భవన్ స్కూల్ వద్ద చిరు వ్యాపారి ఆకాశ్ గప్చుప్ బండి నడిపిస్తున్నారు. కాప్సే హర్మిత్ సింగ్ అనే వ్యక్తి అక్కడికి వచ్చి ఆకాశ్ వద్ద ₹10 గప్చుప్లు తిన్నాడు. అనంతరం ఆకాశ్ డబ్బులు అడిగితే.. నన్నే అడుగుతావా.. అంటూ తన వద్ద ఉన్న చిన్న చాకుతో ఆకాశ్ వేళ్ళు కోశాడు.
ఘటనా స్థలానికి రెండో ఠాణా పోలీసులు చేరుకొని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆకాశ్ను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనతో అక్కడే ఉన్న స్థానికులు కంగుతిన్నారు. పది రూపాయల కోసం దారుణానికి పాల్పడడం ఏమిటని చర్చించుకుంటున్నారు.