అక్షరటుడే, వెబ్డెస్క్: whatsapp group Admin | ప్రస్తుతం ఇంట్లో కంటే నెట్టింట్లోనే ప్రజలు ఎక్కువ సేపు గడుపుతున్నారు. సోషల్ మీడియా(Social Medai)తో కాలక్షేపం చేస్తూ రోజులు వెళ్లదీస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు. వాట్సాప్, టెలిగ్రాం లాంటి సోషల్ మీడియా వేదికల్లో గ్రూప్లు పెట్టి మిత్రులతో చాటింగ్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా గ్రూప్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఇలా వేటికవే వాట్సాప్ గ్రూప్లు పెడుతున్నారు. అందులో చాలా మంది మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తుంటారు. అయితే ఆ మెసేజ్లతో ఏదైనా సమస్య వస్తే సందేశం పంపిన వారితో పాటు గ్రూప్ అడ్మిన్లు కూడా ఇబ్బందుల్లో చిక్కుకుంటారు.
whatsapp group Admin | ఇటీవల కేసు నమోదు
చాలా మంది ఉత్సాహంతో వాట్సాప్(Whatspp) గ్రూప్లు క్రియేట్ చేస్తారు. అంతేగాకుండా మరికొందరికి అడ్మిన్గా అవకాశం ఇస్తారు. అయితే అందులో వచ్చే మెసేజ్లు, ఫొటోల గురించి అంతగా పట్టించుకోరు. ఇటీవల కామారెడ్డి జిల్లాలోని ఓ పాఠశాలలో పదో తరగతి ప్రశ్నలు బయటకు వచ్చిన ఘటన కలకలం రేపింది. ఇందుకు సంబంధించి ఫొటో పలు వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ అయింది. దీంతో పోలీసులు ప్రశ్నలను బయట పెట్టిన వారితో పాటు వాట్సాప్ గ్రూప్ అడ్మిన్పై కూడా కేసు నమోదు చేశారు. ఇలా గతంలోనూ పలువురు అడ్మిన్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
whatsapp group Admin | సీఎం సీరియస్
ఇటీవల సోషల్ మీడియాలో నకిలీ వార్తలు, ఫేక్ ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి. ఈ విషయంపై సీఎం రేవంత్రెడ్డి సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ, ఏఐ జనరేటేడ్ ఫొటోలు, వీడియోల వ్యాప్తి అరికట్టడానికి సైబర్ క్రైం విభాగాన్ని బలోపేతం చేయాలని ఆయన ఆదేశించారు. ఇలాంటి వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. దీంతో నకిలీ వార్తలు, ఫేక్ ఫొటోలు వచ్చిన గ్రూపులకు అడ్మిన్గా ఉన్న వారిపై సైతం కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
whatsapp group Admin | ఇలా చేయాలి..
వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు నకిలీ వార్తలను ఫార్వర్డ్ చేయకుండా చూడాలి. అలాంటి పోస్టులు కనిపిస్తే వెంటనే డిలీట్ చేయాలి. అంతేగాకుండా పంపిన వారిని హెచ్చరించాలి. ఫేక్ ఫొటోలు, వీడియోలు పంపే వారిని గ్రూపుల నుంచి తీసివేయాలి.