అక్షరటుడే, న్యూఢిల్లీ: Olympics | 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులను పొందే దిశగా భారత్ మరో కీలక అడుగు వేసింది. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ బిడ్పై గట్టి సంకల్పంతో ఉన్నట్లు పునరుద్ఘాటించారు.
గాంధీనగర్లో రూ. 316.82 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ‘పారా హై-పర్ఫార్మెన్స్ సెంటర్’ను వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం సమీపంలో 10 ప్రధాన స్టేడియంలు నిర్మించనున్నట్లు అమిత్ షా ప్రకటించారు.
“2036 ఒలింపిక్ గేమ్స్ను ఈ 10 క్రీడా సముదాయాల్లో నిర్వహించాలని భారత్ సంకల్పించింది. గుజరాత్ ఇప్పటికే ఈ దిశగా సిద్ధమవుతోంది” అని అమిత్ షా అన్నారు.
ప్రత్యేకంగా పారా హై-పర్ఫార్మెన్స్ సెంటర్ ప్రాముఖ్యాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరించారు. ఇది గుజరాత్లోని దివ్యాంగ (ప్రత్యేక అవసరాల) అథ్లెట్లకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు కీలకమైన వేదికగా మారనుందన్నారు.
గతంలో దివ్యాంగుల గురించి అపహాస్య పదాలను వాడే పరిస్థితి ఉండేదని, కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారికి గౌరవప్రదమైన ‘దివ్యాంగ’ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారని అమిత్ షా పేర్కొన్నారు.
గుజరాత్ ప్రభుత్వం ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ నేతృత్వంలో క్రీడల అభివృద్ధికి పలు కీలక కార్యక్రమాలను అమలు చేస్తోందని అమిత్ షా చెప్పారు. ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’ లక్ష్యంతో దేశంలోనే అత్యుత్తమ క్రీడా మౌలిక వసతులను గుజరాత్ రాష్ట్రం కలిగి ఉందని షా పేర్కొన్నారు.
“2002లో గుజరాత్లో క్రీడల బడ్జెట్ కేవలం రూ. 2 కోట్లు. కాగా, ఇప్పుడు రూ. 352 కోట్లకు పెరిగింది. ఇది ప్రభుత్వ క్రీడల అభివృద్ధిపై ఉన్న నిబద్ధతను చూపిస్తోంది” అని అమిత్ షా చెప్పుకొచ్చారు.
ఈవెంట్ కోసం గుజరాత్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్ (CSC) సంయుక్తంగా ఒక ఒప్పందం (MoU) కుదుర్చుకున్నాయి. దీని ద్వారా గాంధీనగర్ జిల్లాలో పౌరులకు డిజిటల్ సేవలు సమగ్రంగా అందించేలా చూడనున్నారు.
2023 అక్టోబరులో ముంబైలో జరిగిన 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC) సమావేశంలో 2036 ఒలింపిక్స్కు భారత్ అధికారికంగా బిడ్ వేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఒలింపిక్స్ ఆతిథ్యంపై ఆసక్తిని భారత్ 2021లోనే ప్రదర్శించింది. ఆ సమయంలో, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరేందర్ బాత్రా, 2036 ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు నరేంద్ర మోదీ స్టేడియమే ఉత్తమ వేదికగా మారవచ్చన్నారు.