అక్షరటుడే, వెబ్డెస్క్: Jana Sena : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) గర్జించారు. నిర్భంధాలను చిత్తు చేసి.. అసెంబ్లీ గేట్లు బద్దలు కొట్టి, అధికార పీఠం ఎక్కిన తీరును వర్ణించారు. అన్యాయాన్ని, అక్రమాలపై తన పోరాటం ఎప్పటికీ ఆగదని పునరుద్ఘాటించారు. పవన్ తన ప్రసంగాన్ని అచ్చమిల్లై.. అచ్చమిల్లై అనే పాటతో ప్రారంభించారు. భయం లేదు.. భయం లేదు.. అంటూ తన ధైర్యానికి ఆధారాన్ని జనసేనాని వివరించారు.
Jana Sena : తెలంగాణపై కీలక వ్యాఖ్యలు..
తెలంగాణ(Telangana) ప్రాంతంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన జన్మ స్థలం తెలంగాణ అని, కర్మ స్థలం ఆంధప్రదేశ్ అని పేర్కొన్నారు. కృష్ణమాచార్య మాటలు.. అందరికీ ఊతమిస్తాయన్నారు. “మూగబోయిన కోటి మంది తమ్ముళ్ల గళాన్ని వినిపించిన నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అలాంటి కోటి ధివిటీల కాంతి జ్యోతి తెలంగాణ.. గతంలో కరెంటు షాక్ తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నన్ను కొండగట్టు ఆంజనేయుడి ఆశీస్సులు ఆదుకున్నాయి.. నన్ను ప్రేమించే ప్రజల దీవెనే నాకు ఊపిరి పోసింది.. అలాంటి తెలంగాణ బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు..”
“బండెనక బండి గట్టి.. పదహారు బండ్లు కట్టి.. అంటూ కాళ్లకు గజ్జె కట్టి.. చేతిలో కర్ర పట్టి.. ఆటని, పాటని ఆయుధంగా మలిచారు గద్దరన్న. యువతలో స్ఫూర్తి నింపారు. నేను కనిపిస్తే ఎలా ఉన్నావు తమ్ముడు అని ఆప్యాయంగా పలకరించే నా గద్దరన్నను, మా ఆడపడుచులు, వీర మహిళల స్ఫూర్తి, పోరాటాన్ని మరువను నేను. మీరంతా రాణి రుద్రమ దేవీలు.. జనసేన వీర వనితలు.. అందరి క్షేమం కాంక్షించే భానుడి లేలేత కిరణాలు.. తేడా వస్తే కాల్చి ఖతం చేసే లేజర్ భీమ్లు మా జనసేన వీర మహిళలు..” అంటూ తన ప్రసంగంలో తెలంగాణతో తనకు ఉన్న అనుబంధాన్ని పవన్ కల్యాణ్ వర్ణించారు.