అక్షరటుడే, తిరుమల: TTD : శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 25న జరగనున్న పుష్పయాగానికి సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు పుణ్యహ వచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణను వేడుకగా చేపట్టారు.


మార్చి 25న ఉదయం 10 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం చేపడతారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పుష్పయాగం కొనసాగనుంది. ఈ సందర్భంగా తులసి, చామంతి, గన్నేరు, మల్లె, మొగలి, జాజి సంపంగి, రోజా, కలువల వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు.


బ్రహ్మోత్సవాల్లో అర్చక పరిచారకులు, అధికార అనధికారులు, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే.. వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ యాగం నిర్వహణ వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.

కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపినాథ్, సూపరింటెండెంట్లు రాజకుమార్, రమేష్, అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.