అక్షరటుడే, కామారెడ్డి: KAMAREDDY | కామారెడ్డి మున్సిపల్ పాలకవర్గం ముగిసిన తర్వాత అధికారులతో ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి మొదటి సమావేశం నిర్వహిస్తుండడంతో అధికారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అధికారులు, సిబ్బంది, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు మున్సిపల్ కమిషనర్కు సమావేశానికి ఏర్పాట్లు చేయాలని లేఖ పంపారు. మధ్యాహ్నం 2 గంటలకు మున్సిపల్ కార్యాలయ అధికారులు విభాగాల వారిగా వివరణాత్మక సమాచారంతో సమన్వయ సమావేశానికి హాజరు కావాలని లేఖలో పేర్కొన్నారు.
KAMAREDDY | అనంతరం కార్మికులు, ఏజెన్సీలతో..
మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పారిశుధ్య కార్మికులు, నీటి కార్మికులు, యూనియన్ నాయకులతో, ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి సిబ్బంది, కాంట్రాక్టర్, హోర్డింగ్ ఏజెన్సీలతో సమన్వయ సమావేశం ఉంటుంది. రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, సిబ్బందితో వేరువేరుగా సమావేశాలు ఉంటాయని సమాచారం. ఎమ్మెల్యే నుంచి విభాగాల వారిగా వేరు వేరు సమావేశాలు ఉంటాయని స్పష్టంగా పేర్కొనడంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తోంది.
KAMAREDDY | కమీషన్ల కోసం అధికారుల వేధింపులు..
ఇప్పటికే మున్సిపాలిటీ పనులకు సంబంధించి రూ. కోట్లల్లో బిల్లులు ఇవ్వాల్సి ఉండటం, గత పాలకవర్గం సమయంలో బిల్లుల క్లియరెన్స్ కోసం కమిషన్ అడుగుతున్నారని కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఇటీవల 12 మంది కార్మికులను తొలగించారని వారిని చేర్చుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు మున్సిపల్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ అంశాలపై ఎమ్మెల్యే వివరణ అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.