ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం
ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం
Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: Falcon scam : ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్​కు వచ్చిన ఛార్టెడ్ ఫ్లైట్​ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఇదే ఫ్లైట్ లో 15 రోజుల క్రితం ఫాల్కన్ స్కామ్ నిందితులు దుబాయ్ పారిపోయారు. ఫ్లైట్ సీజ్​ నేపథ్యంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది.

ఫాల్కన్ కంపెనీలో పెట్టుబడుల పేరిట రూ.850 కోట్ల స్కామ్ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు అమర్దీప్ కుమార్​కు చెందిన ప్రైవేట్ జెట్ విమానాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు.

ఫాల్కన్ కంపెనీ ఛైర్మన్ అమర్దీప్​ రూ.14 కోట్లతో ఛార్టెడ్ ఫ్లైట్​ను కొనుగోలు చేశాడు. సదరు ఫ్లైట్ తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చింది. మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో దానికి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్​కు అనుమతిచ్చారు. అయితే, ఎమర్జెన్సీ ఏమీ లేకపోవడంతో ఈడీకి విమానాశ్రయ అధికారులు సమాచారం ఇచ్చారు.

ఫాల్కన్ కేసులో కంపెనీ ఛైర్మన్ అమర్దీప్ సహా ఇంకొందరు పరారీలో ఉన్నారు. వీరందరికి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు పంపించారు.

Falcon scam : ఏమిటీ ఫాల్కన్ స్కామ్..

అధిక లాభాల ఆశ చూపించి అమాయకుల నుంచి ఫాల్కన్ సంస్థ పేరిట భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించారు. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ ఫ్లాట్ఫామ్, మల్టీలెవెల్ మార్కెటింగ్ స్కీమ్లతో రూ.1,700 కోట్లు వసూలు చేశారు. ఇందులో రూ.850 కోట్ల వరకు డిపాజిటర్లకు తిరిగి చెల్లించారు. మిగిలిన రూ.850 కోట్లు చెల్లించకుండా బోర్డు తిప్పేశారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 6,979 మందిని మోసం చేశారు. ఫాల్కన్ క్యాపిటల్ వెంచర్స్ కంపెనీ డైరెక్టర్ కావ్య నల్లూరి, బిజినెస్ హెడ్ పవన్ కుమార్ ఓదెలను సైబరాబాద్ ఆర్థిక నేరాల నియంత్రణ విభాగం(ఈఓడబ్ల్యూ) అధికారులు అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement