అక్షరటుడే, వెబ్డెస్క్ : Komatireddy | అతి త్వరలో తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. ఇప్పటికే ఏఐసీసీ అధిష్ఠానం ముమ్మర కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సహా సీనియర్ నేతలతో సమాలోచనలు జరుపుతోంది. ఈ సమయంలో పలువురు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరికి వారు పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు మీడియాతో కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇటీవల బీసీ నినదంపై పలువురు కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర కాంగ్రెస్ లో తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తే కాంగ్రెస్ పార్టీకే లాభం అన్నారు. కాకపోతే తనకు ఆ పదవి ఎప్పుడు వస్తుందో చెప్పలేనన్నారు. తాను 2018లో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే బీజేపీకి, ఆ తర్వాత బీజేపీ నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్కి డిపాజిట్లు రాలేదని ఆయన గుర్తు చేశారు. నిద్రాహారాలు మాని భువనగిరి ఎంపీ సీటు గెలిపించినట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.
కాగా.. ఇటీవల ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థులు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. వీరిలో నుంచి ఒకరికి కేబినెట్ లో బెర్త్ ఖాయం అని తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, హైదారాబాద్ నుంచి మరో ఇద్దరికి మంత్రి పదవి ఖాయమని తెలుస్తోంది. మిగితా ఎవరికి చోటు కల్పిస్తారు అనేది ఇంకా స్పష్టత రాలేదు.