అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy MLA | ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మున్సిపల్ ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో తనకంతా తెలుసునని, అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సోమవారం మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల ఉద్యోగులతో విడివిడిగా సమావేశమై మాట్లాడారు. ఇంటి కొలతల్లో వార్డు ఆఫీసర్ల పొరపాట్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అక్రమ నీటి కనెక్షన్లు తొలగించాలని, కమర్షియల్ భవనాలకు తాగునీటి కనెక్షన్ ఇవ్వొద్దని సూచించారు. ఎండాకాలంలో తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
ఇంజినీరింగ్ అధికారులు ఒకే తేదీలో తీర్మానం, ఎంబీ రికార్డులు, అగ్రిమెంట్ చేసినట్లు ఆధారాలున్నాయని.. వారు ఇకపై పద్ధతి మార్చుకోవాలని సూచించారు. అలాగే బిల్లుల కోసం అధికారులను బెదిరిస్తే కాంట్రాక్టర్లపై కేసులు తప్పవని, బ్లాక్ లిస్టులో చేరుస్తామన్నారు. 16 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏ ప్రాతిపదికన తీసుకున్నారని అధికారులను ప్రశ్నించారు. కొత్తగా చేరిన వారికి జీతాలు ఇవ్వడం కుదరదని, వారంతా వెళ్లిపోవాలని సూచించారు.
వివిధ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు పెట్టాలని, బాధ్యులను శాశ్వతంగా తొలగించాలన్నారు. ఈ విషయమై కలెక్టర్తో మాట్లాడతానన్నారు. పట్టణంలో అన్ని హోర్డింగ్లకు సంబంధించిన బిల్లులు వసూలు చేయాలని చెప్పారు. అక్రమ కట్టడాలు, ఆక్రమణలపై పూర్తి వివరాలివ్వాలన్నారు. తప్పు చేసే అధికారులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తీరు మార్చుకోవాలని సూచించారు. సమావేశంలో కమిషనర్ రాజేందర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.