అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28 నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. అలాగే టెన్త్ వార్షిక పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. ఇంటర్ పరీక్షలకు 35,346 మంది విద్యార్థులు హాజరు కానుండగా, 57 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, టెన్త్ పరీక్షలకు 22,274 మంది విద్యార్థులకు గాను 143 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్షలను సాఫీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాపీయింగ్కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించి, కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని సూచించారు. ఈ సమావేశంలో డీఐఈవో రఘురాజ్, జిల్లా విద్యాశాఖ పరీక్షల విభాగం సహాయ కమిషనర్ విజయభాస్కర్, ఆర్టీసీ ఆర్ఎం కె.జాని రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.