అక్షరటుడే, హైదరాబాద్: బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి పురిటిలోనే గొంతు నొక్కాలని సాగుతున్న కుట్రలను బీసీలంతా కలిసి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణలో పునాది రాయి పడిందని పేర్కొన్నారు. 17వ అఖిల భారత పద్మశాలి, 8వ తెలంగాణ పద్మశాలి సంఘం మహాసభల్లో ముఖ్యమంత్రి ప్రసంగించారు.
Padmasali : తప్పులు ఎక్కడ ఉన్నాయో చెప్పరే..
‘ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా కులగణన చేపట్టాం. దానిపై కొందరు కావాలని తప్పుల తడక అని విమర్శిస్తున్నారే గానీ, తప్పులు ఎక్కడ ఉన్నాయో చెప్పడం లేదు.’ అని సీఎం అన్నారు.
Padmasali : హక్కులు కాలరాసే ప్రయత్నాలు..
‘విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో రిజర్వేషన్లు వస్తే పరిపాలన బీసీల చేతుల్లోకి వెళ్తుందని, అందుకే వారి హక్కులను కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించి వారి అభ్యున్నతి కోసం పాటుపడుతా.’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Padmasali : ఉజ్వల భవిష్యత్తు కోసం
‘రాజకీయంగా, విద్య, ఉద్యోగ పరంగా పిల్లల భవిష్యత్తు, వృత్తుల కోసం, వృత్తుల్లో నైపుణ్యం పెంచుకోవడం.. వంటి ఉజ్వల భవిష్యత్తు కోసం అవసరమైన ప్రణాళికలతో వస్తే ప్రభుత్వం అండగా నిలబడుతుంది.’ ముఖ్యమంత్రి తెలిపారు.
Padmasali : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ..
‘తెలంగాణ కోసం స్వర్గీయ కొండాలక్ష్మణ్ బాపూజీ సర్వస్వం త్యాగం చేశారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ(Indian Institute of Handloom Technology)ని సాధించుకున్నాం. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకున్నాం. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలన్న విజ్ఞప్తిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం.’ అని చెప్పారు.

Padmasali : తెలంగాణ సాధనలో పద్మశాలీల పాత్ర..
‘తెలంగాణ సాధనలో, తెలంగాణ పునర్నిర్మాణంలో పద్మశాలీల పాత్ర మరువలేనిది. ఈరోజు అనేక మందికి రాజకీయ నిలువనీడనిచ్చింది పద్మశాలీలే. రైతన్నలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో నేతన్నలకు కూడా ఈ ప్రభుత్వం అంతే ప్రాధాన్యమిస్తుంది.’ అని సీఎం పేర్కొన్నారు.
Padmasali : 1.30 కోట్ల చీరల తయారీ బాధ్యత
‘రాష్ట్రంలో స్వయం సహాయ సంఘాల్లో 65 లక్షల మంది సభ్యులకు ఏటా రెండు నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. అందుకు అవసరమైన కోటీ 30 లక్షల చీరలను తయారు చేసే బాధ్యత పద్మశాలీలకు అప్పగిస్తాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన బతుకమ్మ చీరల బకాయిలు, కరెంటు బకాయిలు, బీమా డబ్బులను ఈ ప్రభుత్వం చెల్లించింది.’ అని గుర్తు చేశారు.

Padmasali : 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం..
‘సోలాపూర్లో మన పద్మశాలీ సోదరులే అక్కడ స్థిరపడ్డారు. అక్కడ మార్కండేయ భవన నిర్మాణం కోసం రూ. కోటి మంజూరు చేస్తున్నాం. సోలాపూర్, బీవండి, వర్లి వంటి అనేక ప్రాంతాల్లో మన సిరిసిల్ల సోదరులు స్థిరపడ్డారు’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీలు సమష్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఈరవత్రి అనిల్, పద్మశాలీ నేతలు పాల్గొన్నారు.