అక్షరటుడే, న్యూఢిల్లీ: Parliament Sessions | పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్లో విపక్షాలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఓటింగ్ అక్రమాలు, హిందీ, డీలిమిటేషన్, మణిపూర్ అల్లర్లపై బీజేపీ ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీశాయి. ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు పలు అంశాలపై గళం వినిపించడంతో సమావేశాలు వాయిదా పడ్డాయి.
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్పై చర్చతో పాటు వక్స్ బోర్డ్ సవరణ బిల్లు తదితర కీలక బిల్లులకు ఆమోదం కోసం సోమవారం సభల్లో ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలో విపక్ష సభ్యుల ఆందోళనతో గందరగోళం నెలకొంది.
లోక్సభ, రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కాగానే డీఎంకే సభ్యులు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై స్వరం అందుకున్నారు. హిందీని బలవంతంగా రుద్దడంపై ఉభయసభలను నిలదీశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.
వాయిదా తర్వాత విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సభ తిరిగి ప్రారంభమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఓటింగ్లో అవకతవకలు జరిగాయంటూ లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ గళమెత్తారు. ఓటింగ్లో అక్రమాలు జరిగాయని, దీనిపై దేశవ్యాప్తంగా సందేహాలు ఉన్నాయనే అనుమానాన్ని లేవనెత్తారు. ఈ అంశంపై చర్చించాల్సిందేనని రాహుల్ గాంధీ పట్టుబట్టారు.
మరో వైపు జాతీయ విద్యా విధానంపై చర్చ జరపాలని రాజ్యసభలో డీఎంకే సభ్యులు పట్టుబట్టారు. డీలిమిటేషన్ అంశంపై ఆందోళకు దిగినంత పని చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో డీఎంకే ఎంపీలకు, ధర్మేంద్ర ప్రదాన్కు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. “డీఎంకే సభ్యులకు విద్యార్థుల భవిష్యత్తుపై శ్రద్ధ లేకుండా పోయింది. విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేస్తూ, పిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని” అంటూ ధర్మేంద్ర మండిపడ్డారు. దీంతో కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగారు.
విపక్ష ఎంపీల ఆందోళనపై రాజ్యసభ వ్యవహారాల మంత్రి జేపీ నడ్డా ఘాటుగా స్పందించారు. ఓటింగ్ వ్యవహారంపై చర్చకు పట్టబట్టడం పార్లమెంటును అవమానించడమేనన్నారు. జాతీయ విద్యావిధానంపై డీఎంకే వ్యవహరిస్తున్న తీరు సరికాదని పేర్కొన్నారు. సభ్యులకు సమస్యలపై చర్చించే ఉద్దేశం లేదన్నారు. కేవలం ఆందోళనతో సభల్లో గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాజ్యసభ నుంచి విపక్షాలు వాక్ అవుట్ చేశాయి.