అక్షరటుడే, కామారెడ్డి: moneylenders | నిబంధనలకు విరుద్ధంగా అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తున్న వారిపై పోలీసులు కొరఢా ఝులిపించారు. ఆకస్మిక దాడులతో హడలెత్తించారు. అధిక వడ్డీతో అమాయక ప్రజలను నిలువునా దోచుకుంటున్న వర్తకుల భరతం పట్టారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 69 చోట్ల పోలీసులు స్పెషల్ రైడ్స్ చేపట్టారు.
మాయమాటలతో నమ్మిస్తూ వారి ఇల్లు, భూమి పత్రాలను తాకట్టు పెట్టుకుని, నిండా ముంచుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. వ్యాపారుల నుంచి విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అనుమానం ఉన్న వ్యాపారులందరిపై దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తనిఖీలలో పట్టుబడ్డ ఆధారాలను పరిగణనలోకి తీసుకొని, 6 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. వ్యాపారులు చేస్తున్న ఆర్థిక మోసాలను తట్టుకోలేక ఎంతోమంది బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కావొద్దనే మోసపూరిత వ్యాపారులపై దాడులు చేపట్టినట్లు చెప్పారు.