అక్షరటుడే, ఇందూరు: Police raids : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు వడ్డీ వ్యాపారులపై మెరుపు దాడులు చేస్తున్నారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు గురువారం తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు.
నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పలు చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో పలువురు వ్యాపారుల ఇళ్లపై దాడులు చేపట్టారు. సామాన్యులు, చిరు వ్యాపారుల అవసరాలను ఆసరాగా చేరుకుని, అధిక మొత్తంలో వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేపట్టారు.
Police raids : బడా వ్యాపారులు ఉన్నారా..!
ఉభయ జిల్లాల్లో వడ్డీ వ్యాపారులు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో.. ప్రధానంగా ఆర్మూర్ పట్టణంలో చిరు వ్యాపారుల రక్తం పీల్చుతున్నారనే చెప్పాలి. ఇక్కడ వడ్డీ వ్యాపారుల దోపిడీ అధికంగా ఉంటోంది. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఓ స్టార్ హోటల్ నిర్వాహకుడు, మాజీ ప్రజాప్రతినిధి, మరో సౌకారి డాక్టర్, ఇద్దరు మార్వాడి వ్యాపారులు పెద్ద మొత్తంలో వడ్డీ దందా నిర్వహిస్తున్నారు. ఒక విధంగా వీరిది వడ్డీ వ్యాపారమే ప్రధాన బిజినెస్.
ఖరీదైన ఖాళీ స్థలాలు, భూములు రిజిస్ట్రేషన్ చేసుకుని కోట్ల రూపాయల్లో వడ్డీ దందా సాగిస్తున్నారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డులో ఓ వెంచర్ కోసం రూ.20 కోట్లు అప్పుగా ఇచ్చి.. తీరా వెంచర్ కాజేసిన ఉదంతం పోలీసుల దృష్టిలోనూ ఉంది. మరి ఈ బడా వ్యాపారులంతా తాజా చిట్టాలో ఉన్నారా..? అనేది మరి కాసేపట్లో తేలనుంది.
కాగా.. ఇటీవల కామారెడ్డి జిల్లాలో వడ్డీ వ్యాపారుల కార్యాలయాలు, ఇళ్లలో సోదాలు చేసి పలువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిజామాబాద్ జిల్లాలో వడ్డీ వ్యాపారుల ఆగడాలపై సీపీ సాయిచైతన్య దృష్టి సారించడం జిల్లాలో చర్చనీయాంశమైంది.