అక్షరటుడే, వెబ్డెస్క్: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో తొమ్మిది నెలల పాటు గడిపి కొద్ది గంటల్లో తిరిగి భూమిపైకి రానున్న భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్కు ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు. సునీతా సురక్షితంగా తిరిగి రావాలని, ఆమెకు మంచి ఆరోగ్యం కలగాలని ప్రధాని ఆకాంక్షించారు. ఆమె సాధించిన విజయాల పట్ల 1.4 బిలియన్ల భారతీయులు గర్వపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
“140 కోట్ల మంది భారతీయులు మీ విజయాలపై గర్వంగా ఉన్నారు. మీ ధైర్యం, పట్టుదల ఇటీవల మరోసారి ప్రపంచానికి అర్థమైంది” అని ప్రధాని పేర్కొన్నారు. “మీరు వేల మైళ్ల దూరంలో ఉన్నా కూడా భారత దేశ ప్రజల హృదయాలకు చాలా దగ్గరగా ఉన్నారు. మీరు సురక్షితంగా తిరిగి చేరుకోవాలి. మీ ఆరోగ్యం బాగుండాలి. మిషన్ విజయవంతం కావాలని భారత ప్రజలు ప్రార్థిస్తున్నారు” అని మోదీ తెలిపారు. ‘మీరు సురక్షితంగా చేరుకున్న తర్వాత భారత్లో పర్యటించాలి’ అని సునీతా విలియమ్స్ను ప్రధాని లేఖలో కోరారు.
బుధవారం తెల్లవారు జామున భూమికి..
వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ సుమారు తొమ్మిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. వారు భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు భూమిపైకి చేరుకోనున్నట్లు నాసా ప్రకటించిన విషయం తెలిసిందే.