అక్షరటుడే, ఇందూరు: Dinesh Kulachari | ఎంపీ అర్వింద్ నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యే భూపతిరెడ్డితో చర్చకు సిద్ధమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి సవాల్ విసిరారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వచ్చే ఆదివారం ఎక్కడికి పిలిస్తే అక్కడ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఎంపీ అర్వింద్ రాజకీయాలకు అతీతంగా జక్రాన్పల్లి ఎయిర్పోర్టుపై సీఎంతో మాట్లాడితే.. ఎమ్మెల్యే భూపతిరెడ్డి కనీసం స్పందించలేదన్నారు.
Dinesh Kulachari | సీఎంకు కూడా సమస్యలు చెప్పలేదు..
కాంగ్రెస్ ప్రాతినిథ్యం వహిస్తున్న రూరల్ నియోజకవర్గంలో జవహర్ నవోదయ విద్యాలయం కోసం ఎంపీ పాటుపడితే కనీసం ఎమ్మెల్యే భూపతి రెడ్డి నోరు విప్పలేదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో సీఎం జిల్లాకు వస్తే జిల్లా సమస్యలు కూడా వివరించలేదని తెలిపారు. కాంగ్రెస్ ఏర్పడి 14 నెలలు దాటినా బోధన్, రూరల్ ఎమ్మెల్యేలు నయాపైస అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కేవలం కాంట్రాక్టర్లను మాత్రమే కలుస్తున్నారని పేర్కొన్నారు.
Dinesh Kulachari | పసుపు రైతులపై అవగాహన లేదు..
ఇక పసుపు రైతులపై ఎమ్మెల్యే భూపతి రెడ్డికి కనీస అవగాహన లేదన్నారు. పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం నిజామాబాద్లోనే ఉందని, ఢిల్లీలో రీజినల్ కార్యాలయం ఉందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి దీనిపై అవగాహన పెంచుకోవాలని హితవు పలికారు. రైతుల ఆవేదనను పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసం తప్పులు వెతకడమే కాంగ్రెస్ పని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగిందని, అందులో భూపతిరెడ్డి మొదటి స్థానంలో ఉంటారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు, మాజీ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, పోతన్కర్ లక్ష్మీనారాయణ, నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.