అక్షరటుడే, న్యూఢిల్లీ: Congress : ఇందిరా భవన్లో కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నేతలు చర్చించినట్లు సమాచారం. సుమారు రెండు గంటల పాటు సమాలోచనలు కొనసాగాయి.
ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, కేబినెట్ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో అమలవుతున్న పథకాలపైనా ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించినట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, అమలు చేసినవి, పెండింగ్లో ఉన్నవాటిపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాక, తదుపరి ఉగాది నాటికి మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.