అక్షరటుడే, ఆర్మూర్: పట్టణంలో ఘోరం చోటు చేసుకుంది. డిప్యూటీ తహశీల్దార్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. మామిడిపల్లి సిగ్నల్ వద్ద టిప్పర్ ఢీకొని నిజాంసాగర్ కెనాల్ ప్రాంతానికి చెందిన శివరాం దుర్మరణం చెందాడు. కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు శివరాం స్థానిక కూడలి వద్ద కార్లను తూడుస్తూ యాచకుడిగా జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం మెండోరా మండల డిప్యూటీ తహశీల్దార్ రాజశేఖర్ తన కారులో సిగ్నల్ వద్ద ఆగి ఉండగా.. శివరాం కార్ గ్లాస్ ను క్లీన్ చేశాడు. అనంతరం డబ్బులు ఇవ్వాలని కోరగా రాజశేఖర్ లేవని చెప్పాడు. అంతలోనే గ్రీన్ సిగ్నల్ పడడంతో కారు వెంబడి శివరాం పరుగుపెట్టాడు. కారు నుంచి దిగిన రాజశేఖర్ కోపంతో ఊగిపోయాడు. శివరాంను కాలితో తన్నడంతో అటు నుంచి వస్తున్న టిప్పర్ వెనుక టైర్ల కిందపడి బాధితుడు దుర్మరణం చెందాడు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ దృశ్యాలు పరిశీలించారు. రాజశేఖర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మరోవైపు మృతుడి కుటుంబీకులు శుక్రవారం ఉదయం ఆందోళన చేపట్టారు. ఓ మండలానికి డీటీగా ఉన్న అధికారి ఇలా ప్రవర్తించడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇతడు భీంగల్ డివిజన్ టీఎన్జీవోలో కీలక బాధ్యతల్లో ఉన్నట్లు సమాచారం.