అక్షరటుడే, హైదరాబాద్: Sand Bazaar : సామాన్యులకు అందుబాటు ధరల్లో ఇసుక అందించడమే లక్ష్యంగా మేడ్చల్ జిల్లా బౌరంపేట్ లో TGMDC ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్ ను మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అనిల్ ఈరవత్రి ప్రారంభించారు. ఇక్కడ సర్కారు నిర్ణయించిన ధరకు ఏడాది పొడవునా ఇసుక లభించనుంది. దీనికి సంబంధించిన వివరాలను అనిల్ ఈరవత్రి వెల్లడించారు.

రూ.1600 కు ఫైన్ సాండ్, రూ.1800 కు కోర్ సాండ్ విక్రయిస్తున్నారు. నేరుగా రీచ్ ల నుంచి కూడా వినియోగదారులు ఇసుకను కొనుగోలు చేసుకోవచ్చు. ఉదాహరణకు కాళేశ్వరం రీచ్ నుంచి ఇసుక బుక్ చేసుకుంటే రూ.400 TGMDCకి, కిలోమీటరుకు రూ.3.75 పైసలు రవాణా ఛార్జీలుగా కడితే ఇసుక సరఫరా చేస్తారు.

Sand Bazaar : ఇసుకలో ఉండేది రెండు రకాలే..
ఇసుకలో ఉండేది రెండు రకాలేనని అనిల్ ఈరవత్రి తెలిపారు. సాండ్ బజార్లో అమ్మే ఇసుకను మూసీ సాండ్ అని పేరు పెడుతున్నారని, ఇది సరికాదన్నారు. కోర్ సాండ్ అనేది మూసీ, కాళేశ్వరం, కరీంనగర్, కామారెడ్డి నుంచి కూడా వస్తుందని చెప్పారు. మూసీ నుంచి వచ్చింది ఇంత రేటు, కాళేశ్వరం నుంచి వచ్చింది ఇంత రేటు అని ఎవరూ అమ్మరని గుర్తు చేశారు. సాండ్లో ఉండేది కోర్, ఫైన్ అనే రకాలేనని తెలిపారు.

Sand Bazaar : ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు
ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అనిల్ తెలిపారు. ఫలితంగా గత రెండు, మూడు నెలలుగా ఇసుక మీద వచ్చే ఆదాయం రెండింతలు అయిందన్నారు. రోజుకు రూ.3 – 3.5 కోట్ల ఆదాయం వస్తుందన్నారు.

Sand Bazaar : భారీగా పెరిగిన ఆదాయం
గత ప్రభుత్వంలో 2023, ఏప్రిల్ 1 నుంచి 2024, మార్చి 16 వరకు రూ.623 కోట్ల ఆదాయం వచ్చిందని అనిల్ ఈరవత్రి గుర్తుచేశారు. అప్పుడు 52 రీచ్ లు ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 16 వరకు కేవలం 26 రీచ్ ల నుంచి రూ. 703 కోట్ల ఆదాయం వచ్చిందని, అంటే రూ. 80 కోట్ల ఆదాయం పెరిగిందని తెలిపారు.