అక్షరటుడే, హైదరాబాద్: actress : షాపు ప్రారంభోత్సవానికి ముంబై నుంచి సీరియల్ నటికి ఆమె స్నేహితులు ఆహ్వానించారు. ఆమె ఇక్కడికొచ్చాక వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి చేశారు. దీంతో బాధితురాలు డయల్ 100కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పడంతో మాసబ్ ట్యాంకు పోలీసులు ఆమెను రక్షించారు.
ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ పరశురాం వివరించారు. వెస్ట్ బెంగాల్కు చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ముంబైలో ఉంటూ సీరియల్స్ లో నటిస్తోంది. కాగా, ఆంధ్రాకు చెందిన ఓ యువతి.. హైదరాబాద్లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభించేందుకు సదరు సినీ నటిని పంపించాలని ముంబైలోని తన మిత్రుడు పంకజ్కు చెప్పింది. అలా షాపు ప్రారంభోత్సవానికి ఈ నెల 18న సీరియల్ నటిని హైదరాబాద్కు రప్పించారు.
సదరు సీరియల్ నటికి మాసబ్ ట్యాంకులోని ఓ అపార్ట్మెంట్ లో బస ఏర్పాట్లు చేశారు. 21న రాత్రి 9 గంటల ప్రాంతంలో యువతి, ఆమె ఇద్దరు స్నేహితులు సినీ నటి ఉండే గదికి వెళ్లారు. వ్యభిచారం చేయాలంటూ నటిపై తీవ్ర ఒత్తిడి చేశారు.
అదే రాత్రి 11 గంటల ప్రాంతంలో ముగ్గురు మగవారు నటి ఉన్న గదిలోకి చొరబడ్డారు. తమతో గడపాలని బలవంతం చేశారు. ఆమె నిరాకరించడంతో దాడి చేసి కొట్టారు. దీంతో ఆమె గట్టిగా అరుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అనగానే, ఆ కీచకులు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు.
ఆ తర్వాత, ఇద్దరు మహిళలు నటి గదిలోకి ప్రవేశించి, ఆమెను బంధించారు. ఆమె నగదు తస్కరించి, అక్కడి నుంచి ఉడాయించారు. వరుస పరిణామాలతో బిత్తరపోయిన నటి డయల్ 100కు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆమెను విడిపించి, విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, రెండు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.