అక్షరటుడే, వెబ్డెస్క్ Team India : ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ విజయ దుంధుభి మోగించింది. గత 12 సంవత్సరాలుగా ఊరిస్తున్న కప్ ఎట్టకేలకి భారత్ చెంతకు చేరింది.ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ను గెలుచుకుంది. విజయం తర్వాత అనుష్క శర్మ విరాట్ కోహ్లీతోపాటు, రోహిత్ శర్మను అభినందించి, కౌగిలించుకుంది. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే భారత విజయంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించి 76 పరుగులు చేసి జట్టును విజయపథంలో నడిపించాడు. భారత జట్టు ఇక్కడ 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన సంగతి తెలిసిందే.
Team India : విన్నింగ్స్ సెలబ్రేషన్స్..
2002, 2013లో విజేతగా నిలిచిన భారత్, ఈ ట్రోఫీని రికార్డు స్థాయిలో మూడోసారి కైవసం చేసుకుని సత్తా చాటింది. కివీస్ బౌలర్ రూర్కే బౌలింగ్ లో 49వ ఓవర్ చివరి బంతిని జడేజా బౌండరీకి తరలించడంతో సంబరాలు మొదలయ్యాయి. ఇటీవల టీ20 వరల్డ్ కప్ అనంతరం జరిగిన రెండో మేజర్ ఐసీసీ టైటిల్ ను భారత్ కైవసం చేసుకుంది. విజయం తర్వాత ఒక్కొక్కరి సెలబ్రేషన్స్ మాములుగా లేవు. భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఒకరినొకరు హగ్ చేసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. తాము విజయం సాధించామంటూ గాల్లోకి పంచులు విసిరారు.
డ్రెస్సింగ్ రూమ్లో కూడా భారత ఆటగాళ్లు ఫుల్ ఎంజాయ్ చేశారు. కప్ చేత పట్టుకొని వెరైటీ స్టిల్స్ ఇచ్చారు. ముఖ్యంగా కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా తెగ రచ్చ చేశారు. ఇప్పుడు టీమిండియా విన్నింగ్ సెలబ్రేషన్స్కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ప్రతి మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయినా, కెప్టెన్ గా జట్టును విజయపథంలో నడిపించి విజేతగా కప్ అందించాడు. చివర్లో ఉత్కంఠ నెలకొన్న సమయంలో రాహుల్, జడేజా జాగ్రత్తగా ఆడి భారత్ కు విజయాన్ని అందించగా దేశ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా క్రీజులో ఉన్న బ్యాటర్లు రాహుల్, జడ్డూల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.