అక్షరటుడే, వెబ్డెస్క్: Farmers | ఎండలు మండిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీటి కొరత వలన పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులని ఆదుకునేందుకు కీలక చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. రైతులకు పరిహారం అందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ.. రైతుల పంటల వివరాలను సేకరించాలని నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో పంటలు ఎండిపోతున్న ప్రాంతాలను గుర్తించి.. ఆయా గ్రామాలు, మండలాల వారీగా పంటల వివరాలు సేకరించింది. ఇక మండలాధికారులకు వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Farmers | కీలక నిర్ణయం..
క్షేత్రస్థాయిలో సర్వే తర్వాత పంటలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వరి సాగుకు బోనస్ అందించడంతో రైతులు పెద్ద ఎత్తున వరి పంటను సాగుచేశారు. ఈ ఏడాది 45 లక్షల ఎకరాల్లో వరి పంటను వేయగా గతేడాదితో పోలిస్తే దాదాపు 8 లక్షల ఎకరాలు ఎక్కువ. అయితే.. ఇంత భారీ విస్తీర్ణంలో సాగుచేసిన పంటలకు భూగర్భ జలాల తగ్గుదలతో పెద్దమొత్తంలో నష్టం కలిగింది. ప్రభుత్వ అధికారులు ఎండిన పంటల పరిస్థితి తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో.. తహశీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు.. నీటి పారుదల శాఖలోని డీఈఈ, ఏఈఈలతో సహా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పంటలు ఎండిపోకుండా తగిన సూచనలు చేస్తున్నారు.
మరోవైపు విద్యుత్ శాఖ అధికారులతో కూడా సమన్వయంతో పని చేయాలని చెబుతున్నారు. నీటిని సమర్థవంతంగా వాడుకునేందుకు రైతులకు మార్గదర్శకాలు ఇవ్వడం.. ఆయా ప్రాంతాల్లో నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించేందుకు సూచనలు చేయడం వంటివి చేస్తున్నారు. గతేడాది పంటలు తీవ్ర నష్టం కలిగించగా, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇచ్చి ఆదుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ సీజన్లో ఎండల కారణంగా పంటల నష్టం అధికంగా ఉంటే.. ఎకరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు పరిహారం ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది.