అక్షరటుడే, వెబ్డెస్క్: Texas : ఉజ్వల భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన విద్యార్థిని జీవితాన్ని రోడ్డు ప్రమాదం చిదిమేసింది. ఉన్నత చదువు పూర్తి చేసుకుని నెల రోజుల్లో పట్టాతో తిరిగి వస్తుందనుకుంటే మృత్యువు కబళించడంతో ఆమె కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచేసింది.
అమెరికాలోని టెక్సాస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరులోని రాజేంద్రనగర్ కు చెందిన వంగవోలు దీప్తి (23) మృతి చెందింది. మరో విద్యార్థిని గాయపడింది. డెంటన్ సిటీ(Denton City)లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్(University of North Texas) లో దీప్తి ఎంఎస్ చేసేందుకు వెళ్లింది. నెల రోజుల్లో కోర్సు పూర్తికానుంది.
ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి దీప్తి రోడ్డుపై నడస్తూ వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దీప్తి తలకు తీవ్ర గాయం కాగా, స్నిగ్ధ కూడా గాయపడింది.
ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు దీప్తి స్నేహితులు చేరవేశారు. ఆయన కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్(Union Minister Pemmasani Chandrasekhar) క్యాంప్ కార్యాలయంలో సంప్రదించగా.. ఆన్లైన్లో విరాళాల రూపంలో 80,000 డాలర్ల వరకు సేకరించి, చికిత్సకు వినియోగించినా ఫలితం లేకుండాపోయింది. ఈ నెల 15న దీప్తి కన్నుమూశారు. నేడు(శనివారం) నాటికి గుంటూరుకు మృతదేహం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.