అక్షరటుడే, హైదరాబాద్: cabinet expansion : తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ (Telangana Cabinet Expansion)కు రంగం సిద్ధమైంది. మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు గవర్నర్ ను కలవనున్నారు. ముఖ్యమంత్రి మ. 12 గంటలకు రాజ్ భవన్ వెళ్లనున్నారు. ఏప్రిల్ 3న మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు సమాచారం. మొత్తం కేబినెట్లో ఆరు ఖాళీలు ఉండగా.. నాలుగు స్థానాలు భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉగాది తర్వాత కేబినెట్ విస్తరణ (Cabinet Expansion) ఉంటుందని తెలియడంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని మాదిగ, లంబాడ, బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు అధిష్ఠానానికి ఇప్పటికే లేఖలు రాశారు. ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు తమ వినతులు పంపారు.
cabinet expansion : సామాజిక వర్గాల విజ్ఞప్తులు
రాష్ట్రంలో మాదిగ జనాభా సుమారు 48 లక్షల మంది వరకు ఉన్నా, ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదనేది వారి వాదన. ఎస్టీ జనాభాలో లంబాడాలు అధిక శాతం ఉన్నారంటూ లంబాడాలు సైతం విస్తరణలో అవకాశం కోసం విజ్ఞప్తులు పంపుతున్నారు.
cabinet expansion : ఆశావహుల్లో వీరు..
ప్రస్తుతం మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో నిజామాబాద్ నుంచి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అధిష్ఠానం తమకు అవకాశం కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.